మునుగోడు, సెప్టెంబర్ 14 : అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరో రాజీనామా చేస్తే రాలేదని, ఈ పథకాలన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కిష్టాపురంలో బుధవారం గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని పెద్దచెరువులో చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మాట్లాడారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసే బాధ్యతను టీఆర్ఎస్ సర్కారు తీసుకొన్నది, ఇప్పటికే సగం మందికిపైగా పంపిణీ చేశామన్నారు.
‘నేను రాజీనామా చేయడం వల్లే ఎండ, వానొచ్చింది’ అని చెప్పుకొంటారేమోనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గొర్రెలు కావాలని గొల్ల కురుమలు, చేప పిల్లలు కావాలని మత్స్యకారులు ఏనాడూ అడుగలేదని.. గ్రామాలు, రాష్ట్రం బాగుండాలనే గొప్ప మనస్సుతో సీఎం కేసీఆర్ ఇవన్నీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇటీవల మునుగోడు సభకు వచ్చి న కేంద్ర హోంమంత్రి అమిత్షా.. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణకు రావడం, టైంపాస్ కోసం టీఆర్ఎస్ను తిట్టడం బీజేపీ నాయకులు పనిగా పెట్టుకొన్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా 24 గంటల విద్యుత్తు, రూ.2,016 పింఛన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఆకలిని, దారిద్య్రాన్ని పారదోలిన మానవీయ దార్శనికుడు సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి సందర్భంలోనైనా సీఎం కేసీఆర్ నా యకత్వాన్ని బలోపేతంచేస్తూ అంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపరిచేందుకు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లోని మత్స్య, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథతో రక్షిత జలాలు అందించి ఫ్లోరైడ్ను శాశ్వతంగా రూపుమాపారని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద వ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.