హైదరాబాద్ : తెలంగాణ సమాజం 60 ఏండ్ల గోసకు పదేళ్లలో పరిష్కారం చూపిన మహానీయుడు సీఎం కేసీఆర్(CM KCR) అని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. నీళ్లు, నిధులు, నియామాకాలతోపాటు, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించి రాష్ర్టాన్ని ఆర్థికంగా పురోగమనంలోకి తీసకెళ్లారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణలో తాగు, సాగునీరు అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.
ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల కోసం సొంతింటిని పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయింది. కానీ లబ్ధిదారులకు రూపాయి ఖర్చు చేయకుండానే లక్షలు విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ నిర్మించడంతోపాటు, పంపిణీ చేశాడని వివరించారు. శుక్రవారం సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు, కేసీఆర్ పాలన, రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేదలకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు.
తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ పాలన దక్షత ప్రతిపక్షాలకు పనిలేకుండా చేశాయని, అందుకే పనికిరాని ఆరోపణలు, చేతగాని హామీలతో జనాలను ఓట్లు అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. వారి మాటలు నమ్మి సుభిక్షంగా ఉన్న తెలంగాణను కట్టబెట్టొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పే కాళేశ్వరంలో చిన్న చిన్న ఘటనలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును జర్నలిస్ట్ సమాజం స్వయంగా పరిశీలించాలని సూచించారు.
కేటీఆర్ హయాంలో హైదరాబాద్ అనూహ్య రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. అంతర్జాతీయ కంపెనీలు, వేల కోట్ల పెట్టుబడులే ఆయన పనితీరుకు నిదర్శనం అన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఎస్ఎన్డీ ప్రాజెక్టులతో విశ్వనగరానికి ఏమాత్రం తీసిపోని విధమైన అండర్ పాస్లు, ఎక్స్ప్రెస్వేలు, స్టీల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఓడిపోయే సీట్లలో బీసీలకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. 78 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఎవరి మద్ధతు అవసరం ఉండదన్నారు.