తెలుగుయూనివర్సిటీ, మే 22: ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట దక్కుతున్నదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఆదివారం దక్షిణ భారత యాదవుల ప్లీనరీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలతో కూడిన సావనీర్ను మంత్రి తలసాని ఆవిష్కరించారు. రాజకీయంగా, సామాజికంగా తెలంగాణలో యాదవులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా యాదవుల్లో ఐదుగురికి శాసనసభ్యులుగా, ఒకరికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
సంక్షేమ భవనం నిర్మాణం కోసం కోకాపేటలో 250 కోట్ల విలువ కలిగిన 5 ఎకరాల భూమిని ఇవ్వడంతోపాటు నిర్మాణానికి రూ.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. బడుగు బలహీనవర్గాల పిల్లల విద్య కోసం రాష్ట్రంలో 200 గురుకుల పాఠశాలలు నిర్మించి ఉచితంగా విద్య, పుస్తకాలు, దుస్తులను అందిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ తరగతులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని యాదవులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు తెలంగాణలో సముచిత గౌరవం దక్కిందని అన్నారు. బీసీ కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమ యాదవసంఘం ప్రతినిధి రాజశేఖర్యాదవ్ మాట్లాడుతూ.. ఈర్ష్యాద్వేషాలు వదిలి హక్కుల సాధనకు ఐక్యంగా కృషిచేయాలని సూచించారు. ప్లీనరీలో శాసన సభ్యులు వై అంజయ్య యాదవ్, జయపాల్యాదవ్, సమాచారహక్కు చట్టం పూర్వ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, గ్రేటర్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్, యాదవ వుమెన్ ఫ్రంట్ చైర్పర్సన్ బొంతు శ్రీదేవి, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు నందకిశోర్, సినీ నటి కరాటే కళ్యాణి, టీఎన్జీవో హైదరాబాద్శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్తోపాటు పలు రాష్ర్టాల యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.