హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. గవర్నర్గా ఉండి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా, అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత గవర్నర్కు మీడియా ఎదుట రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉప రాష్ట్రప్రతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు గతంలో మీడియా అడిగిన ప్రశ్నకు ‘అన్ని విషయాలను మీడియాతో మాట్లాడలేం. మా పరిధులు మాకు ఉంటాయి’ అని హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. ప్రజలు ఎన్నుకున్న, మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఏవిధంగా రద్దుచేస్తారని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ను గద్దె దించేందుకు గవర్నర్ను వాడుకొన్నారని, గవర్నర్ వ్యవస్థ రద్దుపై ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నదని చెప్పారు. గవర్నర్ పదవికి రాజ్యాంగంలో అనేక పరిధిలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ ముందుంటారని, గవర్నర్లను ఎలా గౌరవించాలో కేసీఆర్కు, తమకు తెలుసునని చెప్పారు.