జనగామ: ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఘన్పూర్ రిజర్వాయర్లో 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేప పిల్లలను ఏటా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
చెరువులపై పూర్తి హక్కు మత్స్య కారులకే ఉంటుందని, అలాంటి చెరువులను దళారులకు అప్పగించి నష్టపోవద్దని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. చేప పిల్లల విడుదల, పర్యవేక్షణ బాధ్యత వారిపైనే ఉందన్నారు.