హైదరాబాద్ : ఏప్రిల్ చివరినాటికి బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.45కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా అభివృద్ధి, నిర్మాణ పనులను గురువారం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో మంత్రి పరిశీలించారు. పనులు సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూడిక తొలగింపు, తాత్కాలిక రోడ్డు నిర్మాణం తదితర పనుల్లో జాప్యం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదనీరు సమీపంలోని వడ్డెర బస్తీ, ప్రకాశ్నగర్, బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి తదితర కాలనీలు, ఇండ్లలోకి చేరి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, ఆ సమస్యను దూరం చేసే లక్ష్యంతో నాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వరదనీరు రాకుండా నివారించేందుకు నాలాకు కుడి వైపున 634 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ను నిర్మించడం జరిగిందని, 660 మీటర్ల మేర ఉన్న రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం జరిగిందని చెప్పారు.
అదేవిధంగా ఎడమ వైపున 854 మీటర్ల మేర నూతన రిటైనింగ్ నిర్మాణం, 386 మీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచి నిర్మించడం జరిగిందని వివరించారు. ప్రతిపాదించిన చేపట్టిన పనులను అన్ని అనుకున్న సమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎస్ఎన్డీపీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
నాలా వెంట ఉన్న కాలనీలలో సీవరేజ్, వాటర్ లైన్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులన్నీ పూర్తయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియాఉద్దీన్, సీఈ కిషన్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్స్ కృష్ణ, ఎస్సీ భాస్కర్ రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలక్ట్రికల్ ఈడీ సుధీర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.