హైదరాబాద్: గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav ) అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి నడుచుకుంటే మంచిదని సూచించారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువని చెప్పారు. గవర్నర్గా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలని సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటివారే ప్రొటోకాల్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని అన్నారని గుర్తుచేశారు. అది కూడా తెలుసుకుని గవర్నర్ మాట్లాడాలన్నారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పనీపాటా లేదని, సోషల్ మీడియాలో ప్రచారం తప్ప మరేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.