హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రుల విషయంలో బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు అని స్పష్టం చేశారు. కానీ బీజేపీ ఎంపీలు మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కరోనాపై పోరులో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు మద్దతు తెలిపారు. బీజేపీ ఎంపీ అర్వింద్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఎంపీ బండి సంజయ్ తన విధానం మార్చుకోవాలని తలసాని హెచ్చరించారు. బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది అని సూచించారు. కరోనా విషయంలో దేశ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. అక్కడ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఏం చేయలేకపోతోంది.
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదు. జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని బండి సంజయ్ను హెచ్చరిస్తున్నా. కరోనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. బండి సంజయ్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా అని ప్రశ్నించారు. ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది. ఈటల రాజేందర్ వ్యవహారం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందన్నారు. విపక్ష నేతలు ఎన్నైనా మాట్లాడుతారు. దేనిపై అయినా.. ఆధారాలుంటే చూపాలని మంత్రి తలసాని అన్నారు.