Viral news : అగ్రరాజ్యం అమెరికా (USA) లోని న్యూయార్క్ నగరం (NewYork City) లో విచిత్ర దోపిడీలు జరిగాయి. ఒకే వ్యక్తి ఐదు రోజుల్లో ఒకే బ్యాంకుకి చెందిన ఆరు బ్రాంచిలలో దోపిడీలకు పాల్పడ్డాడు. అయితే ఆ ఆరు దొంగతనాలలో అతడు దోచిన నగదు కేవలం రూ.56 వేలు (56K rupees) మాత్రమే కావడం గమనార్హం. ఈ దోపిడీలకు పాల్పడిన నిందితుడిని 33 ఏళ్ల గుస్తావో డిజీసస్ టోర్రెస్ (Gustavo DeJesus Torres) గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్లోని ఛేజ్ బ్యాంకుకు చెందిన ఆరు బ్రాంచిలలో టోర్రెస్ ఇటీవల దోపిడీ చేసేందుకు వెళ్లాడు. భిన్నమైన స్టైల్లో అతడు దోపిడీ చేస్తాడు. నేరుగా క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు. ‘డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకులోని కస్టమర్లను గాయపరుస్తా’ అని రాసి ఉన్న స్లిప్ను క్యాషియర్కి ఇస్తాడు. దాంతో భయపడిన క్యాషియర్ అతడికి కొంత డబ్బు ముట్టజెబుతాడు. ఇచ్చినంత తీసుకుని వెళ్లిపోతాడు. కొన్ని చోట్ల ఇవ్వకపోయినా వెళ్లిపోయాడు.
ఇలా నగరంలోని ఛేజ్ బ్యాంకుకు చెందిన ఆరు బ్రాంచిలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశాడు. కొన్ని బ్రాంచిలలో మొత్తమే డబ్బులు ఇవ్వలేదు. హార్లెమ్లోని బ్యాంకులో కేవలం 20 డాలర్లతోనే టోర్రెస్ వెనుదిరగాల్సి వచ్చింది. అలా మొత్తం ఆరు బ్రాంచిలలో కలిపి అతడు దోచుకున్న మొత్తం నగదు విలువ 605 డాలర్లు మాత్రమే. దీని విలువ భారత కరెన్సీలో కేవలం రూ.56 వేలు మాత్రమే కావడం గమనార్హం. అయితే బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టోర్రెస్కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. 2021 జూన్లో బెల్లెవిల్లేలోని ఛేజ్ బ్యాంకులో చోరీకి పాల్పడింది కూడా టోర్రెసేనని అనుమానిస్తున్నారు. నాటి దోపిడీలో కూడా ఇలాగే క్యాషియర్కు స్లిప్ ఇచ్చి, డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఇక గత ఏడాది మాన్హటన్లోని ఓ బ్యాంకులో జరిగిన చోరీ కేసులో కూడా టోర్రెస్ను అరెస్ట్ చేశారు. ఆ ఘటనలో అతడు దోచుకున్న మొత్తం నగదు విలువ కూడా కేవలం 600 డాలర్లే కావడం గమనార్హం.