హైదరాబాద్ : చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల నారాయగూడలోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్, పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తాను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సమావేశంలో పాల్గొన్న పలువురు చర్చి కమిటీల ప్రతినిధులు, పాస్టర్లు తమపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న మంత్రిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదు. ఆ సమావేశంలో ఏం మాట్లాడారు.. ఎవరు మాట్లాడారో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు వ్యాఖ్యలతో ప్రచారం చేయడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పండుగలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. కేవలం మతాల పేరుతో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.