హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించనున్నదని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచి ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా తరిమివేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ వంటి పథకాలే కాకుండా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెప్పుకోవటానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్రెడ్డిపై మునుగోడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల, ఆయన చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసమే టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందిస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలే రెండోస్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. మునుగోడులో బీజేపీకి పోటీచేసే నైతిక హక్కు లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ఢిల్లీలో అవార్డులు.. రివార్డులు ఇస్తూ గల్లీల్లో మాత్రం రాజకీయంచేసే నీచమైన సంస్కృతిని బీజేపీ అనుసరిస్తున్నదని మండిపడ్డారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారని మంత్రి తలసాని వెల్లడించారు. అందుకు అనుగుణంగా విజయదశమి నాడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణభవన్ ప్రాంగణంలోనే కాకుండా హైదరాబాద్, రాష్ట్రమంతటా అనేక కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తలసాని పేర్కొన్నారు.