హైదరాబాద్ : అందరి సహకారంతోనే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల (Bonalu )ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. మంగళవారం సాయంత్రం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బోనాల ఉత్సవాల నిర్వహణ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి అభినందనలు తెలిపారు.
మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో రేయింబవళ్లు శ్రమించి అన్ని ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేసినట్లు వివరించారు. ప్రధానంగా పోలీసు, ట్రాపిక్, ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ శాఖల తో పాటు దేవాదాయ శాఖ అధికారుల కృషి ఎనలేనిదని ప్రశంసించారు.
బోనాల ఉత్సవాలలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు, జనరేటర్ లను అందుబాటులో ఉంచారని తెలిపారు.
ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా GHMC పారిశుధ్య సిబ్బంది పని చేశారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోనాల విశిష్టతను తెలియజెప్పే విధంగా త్రీడీ మ్యాపింగ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మంత్రి వెంట ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, చైర్మన్ రమేష్, మహంకాళి ఏసీపీ రమేష్, సీఐ కావేటి శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, కమిటీ సభ్యులు కిషోర్, జగదీశ్ వర్మ, కేఎం కృష్ణ, మహేందర్, చారి, దుబాయ్ శ్రీను తదితరులు ఉన్నారు.