హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లను సోమవారం HICC లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయ్యాయి.
అంతేకాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రగతిలో దూసుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా, మిషన భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి భూగర్భజలాలు పెంపొందించినట్లు చెప్పారు.
అంతేకాకుండా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు కనిపించట్లేదని ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందని అన్నారు. మంత్రి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మేయర్ విజయలక్ష్మి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, TSIIC చైర్మన్ గాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు ఉన్నారు.