హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద చేపట్టిన మెగా డెయిరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో డెయిరీ నూతన చైర్మన్ సోమ భరత్ కుమార్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
విజయ డెయిరీ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ. 250 కోట్ల వ్యయంతో, అత్యాధునిక పరిజ్ఞానంతో, 5 లక్షల లీటర్ల సామర్ధ్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద మెగా డెయిరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నదని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున ఔట్ లెట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని లాభాల బాట పట్టించారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రూ. 700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని వివరించారు. ఈ టార్గెట్ రూ. వెయ్యి కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంగా విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసేలా, ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇంకా మరిన్ని నూతన విజయ ఔట్ లెట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
విజయ ఉత్పత్తుల విక్రయాల పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా చేయూతను అందిస్తున్నదని, ఈ విషయాన్ని రైతులకు వివరించి విజయ డెయిరీకి పాలు పోసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. పాల సేకరణ పెరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగేందుకు అధిక పాలను ఇచ్చే నాణ్యమైన పాడి పశువుల ఉత్పత్తి కోసం పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖల సహకారంతో గ్రామాలలో కృత్రిమ గర్భధారణ శిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని మంత్రి తలసాని సూచించారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, విజయ డెయిరీ ఇంచార్జి ఎండీ ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు.