హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తుంటారన్నారు. భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మినీ ఇండియాగా పిలుచుకునే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమన్నారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.