హైదరాబాద్: హుస్సేన్సాగర్లో (Hussain Sagar) గణనాథుల నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి (Khairtabad Ganesh) గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్బండ్లోని (Tank Bund) ఎన్టీఆర్ మార్గ్కు చేరుకున్నది. ప్రస్తుతం క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతికి పూజలు కొనసాగుతున్నాయి. కాగా, ట్యాంక్బడ్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి బోట్లో తిరుగుతూ నిమజ్జనం ఏర్పాట్లు, క్రేన్లను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఉదయం నుంచే ట్యాంక్బండ్వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో ఎల్బీ స్టేడియం, అబిడ్స్ వరకు నిమజ్జనం కోసం వచ్చిన వినాయకులు భారీగా నిలిచిపోయారు. ఇక సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్బండ్కు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలివచ్చారు. తీరొక్క వినాయక విగ్రహాలు, యువకుల నృత్యాలు, డీజే పాటలు, బ్యాండ్ సౌండ్లతో హైదరాబాద్ వీధులు మారుమ్రోగుతున్నాయి. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తికానుంది. అనంతరం వినాయకుల నిమజ్జనాలు ఊపందుకోనున్నాయి.