హైదరాబాద్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మున్సిపల్, విద్యాశాఖ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(Hyderabad Public School) బోర్డు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ సమస్యలను బోర్డు సభ్యులు మంత్రికి విన్నవించారు.
మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలోనే ఈ స్కూల్ కు ఎంతో గుర్తింపు ఉన్నదని, అలాంటి స్కూల్ మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ స్కూల్ లో చదువుకున్న వారిలో అనేక మంది ఐఏఎస్(IAS ) , ఐపీఎస్ (IPS) లుగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులుగా, రాజకీయ నాయకులుగా అనేక హోదాలలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు.
స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం కోసం ప్రతిపాదనలను అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈ స్కూల్ లో తమ పిల్లలను చేర్పించాలనే ఆలోచనతో అనేకమంది తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ ల కోసం తీవ్రమైన ఒత్తిడులు ఉన్న నేపధ్యంలో స్కూల్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని బోర్డు సభ్యులు కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ యాదవ్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ (GHMC )కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ కమిటీ వైస్ చైర్మన్ రఘురాం రెడ్డి, సభ్యులు పయాజ్ ఖాన్, వినోద్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, RDO వసంత, ఇంచార్జి జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.