హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Minister Talasani Srinivas Yadav)యాదవ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ కమ్యునిటీ హాల్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన(Basti Hospital) ను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుండె , కిడ్నీ , మోకాళ్ల చిప్పల మార్పిడి వంటి అత్యంత ఖరీదైన చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఎంఆర్ఐ( MRI) , సిటీ స్కాన్ (CT Scan) లు, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను(Advanced medical equipment) ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
వైద్యం కోసం పేదలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశాల మేరకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖాన ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 153 బస్తీ దవాఖానా లు పని చేస్తుండగా, నూతనంగా మరో 14 మంజూరయ్యారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత యాదవ్, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.