హైదరాబాద్ : ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మంగళవారం సమీక్షించారు. చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కి ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని, దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు(Counters) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
మత్స్య శాఖ ఆధ్వర్యంలో ..
అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. బారికేడ్లు, విద్యుత్ సరఫరా(Elecricity), పోలీసు బందోబస్తు(Police Security), తాగునీరు(Drinking water) అందుబాటులో ఉంచుతామని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ(GHMC) పారిశుధ్య సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పలు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక్కడకు వచ్చే వారికి బద్రి విశాల్ పిట్టి, శ్రీకృష్ణ సమితి, అగర్ వాల్ సమాజ్ వంటి పలు స్వచ్చంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తాయని వివరించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ (MLC) ఎంఎస్ ప్రభాకర్ రావు, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, కార్పొరేటర్లు శంకర్ యాదవ్, నందు బిలాల్, ప్రేమ్ సింగ్ రాథోడ్, అధికారులున్నారు.