హైదరాబాద్ : రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (SEMI) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) పేర్కొన్నారు.
వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే (World Emergency Medicine Day) సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్లో మారథాన్ నిర్వహించారు. సంజీవయ్య పార్కు సమీపంలో థ్రిల్ సిటీ వద్ద మారథాన్(Marathon ) 5కె, 10కె తో పాటు 10 కె సైకిలో థాన్ ను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి అత్యవసర వైద్యం, ఆరోగ్య సంరక్షణ కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. అత్యవసర సమయాల్లో అత్యంత నైపుణ్యం, అంకితభావం, నిపుణులైన వైద్యులు అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సెమీ వైద్య సేవల్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుండడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సెమీ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘జీవితాన్ని కాపాడడంలో ప్రతి సెకను ముఖ్యం’ అని, ఇది ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికే కాకుండా సాధారణ పౌరులందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందించడం, కార్డియాక్ అరెస్ట్లో ఉన్న వారికి ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించడం వారిని సమీప ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేయడం ప్రతి పౌరుడు విధిగా భావించాలని కోరారు.
సెమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరవణ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ వర్మ, శ్రీని ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ రన్స్ క్లబ్, ఈసీఐఎల్ రన్నర్స్ క్లబ్ తో పాటు సెమీ నేషనల్ గవర్నెన్స్ చైర్ పర్సన్ డాక్టర్ ఇమ్రాన్, కోశాధికారి సౌజన్య, సెమీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, ఆర్గనైజింగ్ కో ఆర్టినేటర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.