సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో నిరుడు ఎనిమిది మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించాం. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్ధంగా ఉండాలి.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నియమించబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ లిస్ట్ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలపై శనివారం ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కోసం ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమార్, పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఈ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవసరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని సౌకర్యాలూ కల్పించాలని అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఫర్నీచర్, ఇతర పరికరాలు సిద్ధం చేయాలని సూచించారు. చెప్పారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో నిరుడు ఎనిమిది మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందం పరిశీలనకు రానున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంత్రి కోరారు. మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు గాను, ఈనెల 28న 9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
వచ్చే జూలై, ఆగస్టు నాటికి విద్యా సంవత్సరం ప్రారంభమైతే కొత్తగా 9 జిల్లాల్లో ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. కొత్తగా ప్రారంభమయ్యే 9 కాలేజీలతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690కి పెరుగుతుందని చెప్పారు. గత 60 ఏండ్లలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, గడిచిన 8, 9 ఏండ్లలో 21 మెడికల్ కాలేజీలు రావడం గొప్ప విషయమని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, చీఫ్ ఇంజినీరు, ఇతర అధికారులు పాల్గొన్నారు.