Minister Srinivas Yadav | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా దేశానికి విజన్ ఉన్న నాయకుడు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. వ్యవసాయం, విద్యుత్, సాగు, తాగునీటి రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, దశల వారీగా ప్రాధాన్యతాంశాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లలో కరెంటు, తాగునీటి కష్టాలు తీరాయన్న ఆయన.. వైద్యం, విద్యారంగాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధన్యతనిస్తారని, అందులో భాగంగా మరిన్ని ఉత్తమ పద్ధతులను అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
కేసీఆర్ లాంటి సీఎం ఉంటే అసాధ్యమేమి కాదన్నారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరాతో ఇన్వర్టర్లు, జనరేటర్లు కనుమరుగైనట్లేనని, రానున్న రోజుల్లో ప్లాస్టిక్ సైతం కనుమరుగుకానుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటున్నా.. కొందరికి మాత్రం తెలంగాణలోని అభివృద్ధి కానరావడం లేదని, కళ్లున్న కబోధులని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజీవ్ శర్మ, స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈపీటీఆర్ఐ డీజీ వాణి ప్రసాద్, పీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్, సీఈ రఘు పాల్గొన్నారు.