స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
అభివృద్ధిలో తెలంగాణ పరుగులు
హోంమంత్రి మహమూద్ అలీ
బోధన్, మార్చి 30: పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి స్పీకర్ పోచారం, హోంమంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మెరుగైన విద్యా ప్రమాణాలతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే అవకాశం కలిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీచేస్తున్న దృష్ట్యా నిరుద్యోగ యువతకు అవసరమైన శిక్షణ కోసం తమ కుటుంబం తరఫున బాన్సువాడ, వర్నిలో రెండు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
అన్నిరంగాల్లో నంబర్ వన్గా తెలంగాణ:మంత్రి
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిచిందని మంత్రి మహమూద్ అలీ అన్నారు. పేద మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో సుమారు వెయ్యి గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందు లో ప్రత్యేకంగా 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.