హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళయాళ ప్రజలు అందిస్తున్న సేవలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రసంశించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మళయాళి అసోసియేషన్( CTRMA) ఇన్ అసోసియేషన్ విత్ మళయాళం మిషన్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో కొవిడ్ – 19 నివారణలో భాగంగా 3వ వేవ్ను ముందస్తుగా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవగాహన కోసం జూమ్ యాప్ ద్వారా సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తెలంగాణలో నివసించే అన్ని రాష్ట్రాల ప్రజలను సొంత ప్రజలవలే ఆదరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేరళ ప్రజలంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళయాళీలు అందిస్తున్న సేవలను కీర్తించి అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. కేరళలో గతంలో కురిసిన భారీ వర్షాలకు సీఎం కేసీఆర్ తక్షణం స్పందించి అపన్నహస్తం అందించారన్నారు.
కొవిడ్ నియంత్రణలో బాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారన్నారు. ఇప్పటికే ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అవసరమైన మందులు, ఆధునిక వైద్య పరికరాలు, లాబ్ లను ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలను సొంత ప్రజల వలె సంరక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు.