హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎన్నికల్లోనూ కులం చూసి కాకుండా.. గుణం చూసి గెలిపించాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మహబూబ్నగర్లో ఎవ్వరూ సాధించలేని మెజార్టీని తాను, తమ ఎమ్మెల్యేలు సాధించారనే అక్కసుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రజల మద్దతుతో గెలిచాం కాబట్టే దైవసాక్షిగా అందరినీ సమానంగా చూస్తున్నామని చెప్పా రు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్టీఐని అడ్డంపెట్టుకొని, దొంగతనంగా సంపాదించిన కోట్లాది రూపాయలను వెదజల్లి.. ఓట్లు కొనుక్కుందామనే భ్రమలో పీసీసీ చీఫ్ రేవంత్ ఉన్నారని, నోట్ల కట్టలకు ఓట్లు రాలవని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కొనే దమ్ములేక కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
సభ్యత మరిచి మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రేవంత్ పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన వారికి, బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణను నిరూపించాలని, లేకుంటే టీపీసీసీ పదవికి రాజీనామా చేయాలనే వక్ఫ్ నాయకుల సవాల్ను రేవంత్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఉద్యమ స్ఫూర్తి ఏంటి? ఉద్యమంలో ఆయన ఎక్కడ ఉన్నారు? అనేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉంటే వందేండ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలిపారు. ఆయన నిమ్న కులాలను, చిన్న జాతుల నాయకులను తొక్కిపడేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా మహబూబ్నగర్కు ఏమీచేయని కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రగతిని చూసి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
తన ఎన్నికల అఫిడవిట్పై దుష్ప్రచారం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘమే ఎలాంటి టాంపరింగ్ జరగలేదని స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన కాపీలను సైతం ఆయన మీడియాకు చూపించారు. నాంపల్లి కోర్టు పోలీస్ స్టేషన్కు పిటిషన్ పంపిస్తే ఏదో జరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన క్లీన్ చిట్ను పిటిషనర్ కోర్టులో దాఖలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు. తాము కోర్టుకు అన్ని విషయాలు నివేదిస్తామని, న్యాయం తమ వైపే ఉన్నదని ధీమా వ్యక్తంచేశారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ నాయకులది ముగిసిన అధ్యాయమే అని ఎద్దేవా చేశారు. బీసీలకు బీఆర్ఎస్ చేసినంత మేలు ఎవ్వరూ చేయలేదని, అత్యంత వెనకబడ్డ జాతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.