హైదరాబాద్ : కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయితే మారిందో.. అదే విధంగా దేశ భవిష్యత్తు కూడా మారుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ బయలుదేరినప్పుడు కూడా ఇవే సందేహాలు.. ఇవే అనుమానాలు .. తెలంగాణ వస్తదా.. తెలంగాణ ఎట్ల వస్తది.. ఎట్లిస్తరు.. తెలంగాణ మీ వల్ల అయితదా.. అని మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. అయినా ఆ మాటలను లెక్క చేయకుండా కేసీఆర్.. టీడీపీ నుంచి ఒక్కడే బయటకు వచ్చిండు.. గుంపును జమచేసి తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కరెంటు ఉంది. నీళ్లున్నయ్, వ్యవసాయం పెరిగింది. తెలంగాణ ప్రజలు హాయిగా జీవిస్తున్నరు.
తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశ ప్రజలు బతకాలన్నదే మా నాయకుడు కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ఇల్లు బాగుపడ్డది.. ఊరు బాగుపడ్డది.. పట్నం బాగుపడ్డది.. రాష్ట్రం బాగుపడ్డది.. ఇప్పుడు దేశం బాగుపడాలి. తెలంగాణలో ఏవిధంగా ప్రణాళికతో అభివృద్ధి చేసిండో.. ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో.. దేశవ్యాప్తంగా అవి అమలు కావలన్నది.. తెలంగాణలా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆయన లక్ష్యం, ఆలోచన గొప్పది.. నిజాయతీగా చేస్తుండు కాబట్టి.. ఆయన కోరిక కచ్చితంగా నెరవేరుతదనే నమ్మకం ఉంది. జాతీయ పార్టీలు ఏ విధంగా అయితే పోటీ చేస్తయో అదే విధంగా మా పార్టీ పోటీ చేస్తది. గుజరాతే కాదు.. మోదీ నిలబడ్డచోట కూడా పోటీ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.