హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 ( నమస్తే తెలంగాణ): గణేశకౌత్వంతో మొదలైన అనన్య కూచిపూడి రంగప్రవేశం ఆద్యం తం సభికులను ఉర్రూతలూగించింది. ఆమె ప్రదర్శించిన విభిన్న భంగిమలు వీక్షకులకు పూనకాలు తెప్పించాయి. ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు’ అంటూ సాగిన నాట్యం ఆధ్యాత్మిక సాగరంలో మునకలేయించింది. రుద్రమ్మ ఖడ్గంతో వీరత్వం ప్రదర్శిస్తున్నట్టుగా ‘ఇది రుద్రమ ప్రతాపం’ అంటూ గాల్లో గంతులేస్తూ అనన్య చెలరేగిపోయింది. ఆడది అంటే ఆదిశక్తి అని వేదికపై భద్రకాళిని కళ్లకు కట్టింది. శరీరాన్ని విల్లులా వంచుతూ వేదికంతా కలియదిరుగుతూ వీరత్వాన్ని ఎక్కుపెట్టింది. పిల్లన గోవి ఊదుతూ.. శ్రీకృష్ణుడి లీలను ఆవిష్కరించింది. మొత్తంగా అనన్య కూచిపూడి రంగ ప్రవేశం అపూర్వ ఘట్టంగా నిలిచింది.
రవీంద్రభారతిలో శనివారం సాయంత్రం దీపాంజలి సంగీత సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యువ నృత్యకారిణి అనన్య కూచిపూడి రంగ ప్రవేశానికి మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు జే సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం సతీమణి శోభమ్మ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అనన్య తల్లిదండ్రులు సౌమ్యరావు, శ్రీనివాస్రావు, గ్రాండ్ పేరేంట్స్ పీ వెంకటరావు, భారతి, రవీందర్రావు, శశికళ తదితరులు హాజరయ్యారు.
కళాకారులకు వేదికగా తెలంగాణ
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కళలు పరిఢవిల్లుతున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కవులు, కళాకారులకు రాష్ట్రం వేదికగా మారిందని తెలిపారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, కళలవైపూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి తదితర నృత్యాలు సంస్కారం నేర్పిస్తాయన్నారు. సంస్కృతికి చిహ్నమైన నాట్యకళల్లో పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 నాట్య కళాశాలలున్నాయని, ఇంకా పెంచే యోచనలో ఉన్నామని తెలిపారు. ప్రతీ స్కూల్లో నాట్యం ఒక సిలబస్ గా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మన కళలను దేశం ఎల్లలు దాటించాలని పేర్కొన్నారు. అన న్య నాట్య ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు. కళలో నిమగ్నమైన తీరు గొప్పగా ఉందని దేశపతి శ్రీనివాస్ ప్రశంసించారు.