హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23లో రూ.117 కోట్ల టర్నోవర్ సాధించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పర్యాటక శాఖ వార్షిక టర్నోవర్ సగటున రూ.113 కోట్లు కాగా, తెలంగాణ రాష్ట్రం రూ.4 కోట్లు అదనపు టర్నోవర్ సాధించిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని హరిత ప్లాజాలో నిర్వహించిన పర్యాటక శాఖ సమీక్షలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టూరిజం శాఖను మరింత అభివృద్ధి చేసేందుకు విశేషంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించినట్టు చెప్పారు. భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైనట్టు గుర్తు చేశారు.
రవాణా, హోటళ్లు, పర్యాటక ప్రదేశాల ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో టర్నోవర్ను సాధించిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో లీజుల పేరుతో పర్యాటక శాఖ ఆస్తులను అనుభవిస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టి, ఇప్పటి వరకూ రూ.60 కోట్ల బకాయిలు వసూలు చేసినట్టు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అనేక చారిత్రక నిర్మాణాలు యునెస్కో గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నాయని, వాటికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ టూరిజం ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండీ మనోహర్తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.