Telangana | హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): తిరుమల, షిర్డీకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను తీసుకొచ్చామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బస్ సర్వీసును టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి రవీంద్రభారతిలో శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్-తిరుమలకు రెండురోజుల ప్యాకేజీలో భాగంగా వీటిని అందుబాటులో తీసుకొచ్చామని, పెద్దలకు రూ.4,200, పిల్లలకు రూ.3,360 టికెట్లు ఉంటాయని తెలిపారు. ప్యాకేజీలో భక్తులకు శీఘ్రదర్శన టికెట్లను అందించనున్నట్టు పేర్కొన్నారు. నూతనంగా రూ.3.5 కోట్లతో 2 అత్యాధునిక ఓల్వో మల్టి ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులను, 32.61 లక్షలతో మినీ ఏసీ బస్సు సర్వీస్లను పర్యాటక శాఖ కొనుగోలు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, పర్యాటకశాఖ ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.