హైదరాబాద్: ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో (Telangana) మరే రాష్ట్రం పోటీ పడటంలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. ఇదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అంత్యంత సమర్ధవంతంగా అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్రోడ్లో నిర్వహించిన తెలంగాణ రన్ను (Telangana Run) మంత్రి మహమూద్ అలీతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ శరవేగంగా పురోగమించడానికి ప్రధాన కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ సీఎం అని మంత్రి మహమూద్ అలీ అన్నారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో నిలిచిందని చెప్పారు.
అంచనాలకు మించి..తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్కు పెద్ద సంఖ్యలో యువత హాజరు కావడంతో విజయవంతంగా కొనసాగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన 2కే, 5కే రన్లకు ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు. క్రీడాకారులు ఈషా సింగ్, గాయకులు మంగ్లీ, రామ్, సినీ నటి శ్రీ లీల పాల్గొన్నారు.
రన్ ప్రారంభానికి ముందు గాయకులు మంగ్లీ, రామ్ ఆలపించిన పాటలు యువతీ, యువకులను ఉత్సాహపరిచాయి. దాదాపు 4 వేల మందకిపైగా రన్నర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే బోనాలు, బతుకమ్మలు, డప్పులు, ఇతర నృత్యాలతో హోరెత్తించారు. పోలీస్ అశ్విక దళం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.