మహబూబ్నగర్: ఆంజనేయుని దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆకాంక్షించారు. గురువారం హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగగా.. నేడు ఆ అభయాజనేయుని రథోత్సవం కన్నుల పండువగా జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్నగర్లోని (Mahabubnagar) పాలకొండలో (Palakonda) జరిగిన అభయాంజనేయ స్వామి (Abhayanjaneya swamy) రథోత్సవంలో భాగంగా.. దేవాలయంలో ఘనంగా పూజల నిర్వహించారు. హోమం, హారతి, స్వామి వారి ఊయల సేవ అనంతరం ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. పుర వీధులగుండా సాగిన రథోత్సవంలో పాల్గొన్నారు. బాణసంచా వెలుగులతో రథోత్సవం కన్నులపండుగగా సాగింది. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. వందల ఏండ్ల చరిత్ర ఉన్న పాలకొండ అభయాంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరుగుతున్నదన్నారు. మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఒకప్పుడు పాలకొండ (Palakonda) అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వాటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబడి, మారుమూల గ్రామంగా ఉన్న పాలకొండ.. నేడు హైదరాబాద్లో సైతం కుగ్రామంగా ఉండి ఎంతో అభివృద్ధి చెందిన మణికొండను (Manikonda) తలపిస్తున్నదని పేర్కొన్నారు. దగ్గర్లోనే ఐటీ పార్కు ఏర్పాటుకావడంతో స్థానికులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉద్యోగాలు చేసి సాయంత్రానికే ఇంటికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
గతంలో పంటలు పండక అన్నదాతలు ఆవేదన చెందే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. భూముల విలువ పెరిగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగడం వల్ల స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారని తెలిపారు. భవిష్యత్లో మహబూబ్నగర్ ఇంకా అత్భుతంగా మారాలని, అభయాంజనేయుడి దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఐక్యమత్యంతో జీవించాలని ప్రార్థించానని మంత్రి తెలిపారు.