హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన తేదీల ఆధారంగా త్వరలో నీరా కేఫ్ (Neera cafe) ప్రారంభించనున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఎక్సైజ్, టూరిజం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించనున్న నీరా కేఫ్ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసుకోవాలని సూచించారు. దేశంలోనే మొదటి మాడ్రన్ నీరా కేఫ్లో సకల సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా హైదరాబాద్లోని నీరా కేఫ్ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం నెక్లెస్రోడ్లోని నీరా కేఫ్ను సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంస్థల కార్పొరేషన్ల చైర్మన్లు డాక్టర్ ఆంజనేయగౌడ్, డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, శ్రీధర్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్, టూరిజం ఎండీ మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డేవిడ్ రవికాంత్, దత్తరాజ్గౌడ్, చంద్రయ్య, ఈఎస్లు సత్యనారాయణ, రవీంద్రరావు, అరుణ్కుమార్, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.