మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సంగీత, నృత్య కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాదస్వర విద్వాంసులను తయారు చేసేందుకు ఈ కళాశాల ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కళాశాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కోర్సు చేసిన వారికి లభించే డిప్లొమా సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. నాయీ బ్రాహ్మణులు నాదస్వర వృత్తి ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని విరించారు. వెనుకబడిన ఈ వర్గాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళలు, కళాకారులకు ఎంతో ప్రోత్సహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. కుల వృత్తులను బాగు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో అనేక మంది పేద నాయీ బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వీధి వ్యాపారుల దుకాణాలు అందించి ఆదుకున్నామన్నారు. భవిష్యత్తులోనూ అందరికీ అండగా ఉంటామన్నారు.