మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 22: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పాలమూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంత్రి నివాసానికి చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పదేండ్లలో పాలమూరులో ఊహించని అభివృద్ధి జరిగిందని తెలిపారు.
మరోసారి ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతానని భరోసా ఇచ్చారు. వలసలు వెళ్లే స్థాయి నుంచి స్థానికంగానే ఉద్యోగాలు కల్పించుకునే స్థాయికి పాలమూరు ఎదిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో హన్వాడలో ఫుడ్పార్కు ఏర్పాటుతో మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మహబూబ్నగర్లోని గ్రీన్ బెల్ట్ వద్ద రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి నివాళులర్పించారు.