మహబూబ్నగర్ టౌన్/హన్వాడ, నవంబర్ 16 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో వాటర్రైడింగ్, వేవ్ పూల్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్(Adventure sports )ను అందుబాటులోకి తీసుకొస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. మహబూబ్నగర్ను క్రీడాహబ్గా మారుస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గురువారం వాకర్స్తో ముచ్చటించారు. అనంతరం హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుట్బాల్ గ్రౌండ్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్ కోసం క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఎకో పార్కులో యోగా షెడ్డు, అతిపెద్ద అర్బన్ జంగల్ సఫారీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. నెక్లెస్రోడ్డుపై 3.5 కిలోమీటర్ల మేర నిర్మించిన వాకింగ్ ట్రాక్ వద్దకు, స్టేడియానికి చేరుకునేందుకు ర్యాంప్ ఏర్పాటు చేసి వాకింగ్ చేసే వారికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఉందడాపూర్ నుంచి కృష్ణాజలాలను తీసుకొచ్చి ట్యాంక్బండ్ను నింపుతామన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, కౌన్సిలర్ రామ్లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.