హైదరాబాద్ : రాష్ట్రంలో బుద్ధిజానికి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ అన్నారు. భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రయ్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ నేతృత్వంలోని 24 మంది సభ్యుల ఉన్నతస్థాయి బౌద్ధ ప్రతినిధులు బేగంపేటలోని పర్యాటక భవన్లో మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లాలో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం, ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశం నాగార్జున సాగర్లో బౌద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్లు చెప్పారు.
ప్రాజెక్టులో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ ఆరామాల నిర్మాణానికి అనేక దేశాల నుంచి ముఖ్యంగా తైవాన్, ఇండోనేషియా, మంగోలియా, బెంగళూరుకు చెందిన మహాబోధి సొసైటీకి చెందిన బౌద్ధ సంస్థలు ఆరామాల నిర్మాణం కోసం సంప్రదించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో భూటాన్కు చెందిన అంతర్జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో భూటాన్ – తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ స్థాయి సెమినార్ను నిర్వహించేందుకు చర్చించారు.
సెమినార్లో నాగార్జునుడు బోధించిన సిద్ధాంతాలు నేడు ప్రపంచంలో అనేక దేశాలలో ఆచరణలో ఉన్నాయన్నారు. భూటాన్కు చెందిన అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బౌద్ధం మైత్రీ పూర్వక సంబంధాలను కొనసాగించుటకు భూటాన్ ఆసక్తిగా ఉందన్నారు. సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, టూరిజం ఎండీ మనోహర్, సుద్దాల సుధాకర్ తేజ, టూరిజం, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.