హైదరాబాద్ : భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న టీ20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు తరలిరాగా.. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా.. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో మెయిన్ గేట్ వద్ద ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోగా, మరికొంత మందికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ రవీంద్ర భారతిలో సమీక్ష నిర్వహించారు. అజారుద్దీన్, సీపీ మహేశ్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న రెండో అతిపెద్ద మ్యాచ్ అనీ, కరోనా తర్వాత జరిగే మ్యాచ్ అయినందున డిమాండ్ ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నదే అందరి ఉద్దేశమని, పెద్ద ఈవెంట్ కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణకు పేరు తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం తెలిపారు. క్రికెట్ మ్యాచ్ల నిర్వహణలో తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని, టికెట్లను బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
మ్యాచ్ నిర్వహణలో పోలీసుల వైఫల్యం లేదని మంత్రి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగవని హెచ్సీఏ హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. టిక్కెట్లు ఆలస్యంగా ఆఫ్లైన్లో అందుబాటులోకి తీసుకురావడంతో వల్లే సమస్య తలెత్తిందన్నారు. ఘటనపై హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరిస్తూ.. ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తామని తెలిపారు. లోపాన్ని సవరించుకుంటామని, తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమన్నారు. తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్సీఏ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.