హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరుగనున్న బతుకమ్మ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మను ఎల్బీ స్టేడియం నుంచి వేలమంది మహిళలతో, వెయ్యిమందికి పైగా జానపద గిరిజన కళాకారులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తామన్నారు.
రవీంద్రభారతిలో వివిధ రకాల సాంసృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ పక్షాన మహిళా రచయితలు, కవయిత్రులతో సదస్సు, బతుకమ్మ విశిష్టతను చెప్పే పుస్తకాన్ని ప్రచురించాలని ఆ సంస్థ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ను మంత్రి ఆదేశించారు. అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబర్ 2న గన్పార్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అధికార భాష సంఘం అధ్యక్షురాలు శ్రీదేవికి సూచించారు. తెలంగాణ సాంసృతిక సారథి సారథ్యంలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహించాలని చెప్పారు. మహిళా ప్రతినిధులు, ఇతర మహిళలు రవీంద్రభారతిలో ప్రతిరోజు బతుకమ్మ ఆడుకొనేలా ఏర్పాట్లు చేయాలని భాషా సాంసృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణను ఆదేశించారు. సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో దేవీ వైభవ నృత్యోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, టూరిజం హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టుల్లో బతుకమ్మ ప్రతిమలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.