హైదరాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలందించిన స్టేక్ హోల్డర్లకు ఎక్సలెన్స్ అవార్డులను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.
సీఎం కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి జిల్లాను ఓ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకో అర్బన్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు సోమశిల, ఉమామహేశ్వరం, సింగోటం, మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయం పరిసరాలు, అలంపూర్లోని జోగులాంబ దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రానికి విదేశీ పర్యాటలను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్న స్టేక్ హోల్డర్లకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, నితమ్ డైరెక్టర్ చిన్నం రెడ్డి, ఈడీ శంకర్ రెడ్డి, హాండ్ బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్ మోహన్, టూరిజం స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు.