మహబూబ్నగర్: తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం పెట్టుకుని పాలమూరుకు (Palamuru) వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలన్నారు. పాలమూరు జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పాలమూరుకు మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు. గతంలో ఇక్కడే మీటింగ్ పెట్టి జాతీయ హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
కులం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రశాంతంగా ఉన్న పాలమూరును అల్లకల్లోలం చేసుందుకు మోదీ వస్తున్నారా అని ప్రశ్నించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంటు సాక్షిగా చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఎగువన ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్రకు నేషనల్ స్టేటస్ ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తే పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ పుట్టుకపైనే విమర్శలు చేసిన ప్రధాని తమ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని ఎలా ఆశిస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో పెండింగులో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. కానీ ప్రజల సమక్షంలో జాతీయ హోదా హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన బీజేపీ సర్కారు.. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మేం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూనే ఉంటాం, మీరు మోసపోతూనే ఉండండి అని చెప్పేందుకు మోదీ ఇక్కడకు వస్తున్నారా అని ఫైరయ్యారు.
పార్లమెంటు సాక్షిగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను మెచ్చుకుంటారని బయటకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమన్నా ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఏ వేదిక పైనుంచైతే ప్రసంగిస్తారో అక్కడి నుంచి చూస్తే కరివెన ప్రాజెక్టు కనిపిస్తుందని, సమీపంలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ ఆ పార్టీ నేతలను వెక్కిరిస్తుందన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ దేశం తలెత్తుకునేలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే సహకరించాల్సిన ప్రధాని ఇలా విద్వేషం రగిల్చేలా మాట్లాడడం ఎంతవరకు సబబని నిలదీశారు. తెలంగాణ డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకుంటాము కాని కృష్ణానదిలో నీటివాట తేల్చాలన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడేం పని అని ప్రశ్నించారు. అడ్డదారుల్లో రాష్ట్రంలో పాగావేయాలని బీజేపీ చూస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తున్నదని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీకి గుజరాత్పై ఉన్న పాలమూరుపై లేదని విమర్శించారు. తెలంగాణ పుట్టుకపై ప్రధాని విషం గక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు.