ఖైరతాబాద్, మే 16 : ‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తవ్వినా..బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి. పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌతమ బుద్ధుని 2,585 జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం వద్ద బౌద్ధ భిక్షువులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బుద్ధుడికి నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నాగార్జునసాగర్ వద్ద బుద్ధ వనాన్ని ప్రారంభించుకున్నామని, ఇది ప్రపంచంలోనే అరుదైన ప్రాంతమన్నారు. ఒకప్పుడు బౌద్ధ మతానికి నిలయంగా ఉన్న తెలంగాణ ప్రాంతం బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందన్నారు.
అనేక రకాల నిక్షేపాలు, స్థూపాలు, బుద్ధుడి విగ్రహాలు తవ్వకాల్లో బయటపడుతున్నాయన్నారు. నేలకొండపల్లి స్థూపాలు, జోగులాంబ వద్ద తాజాగా తవ్వితే నాటి అవశేషాలు కనిపించాయన్నారు.రామప్ప, వెయ్యి స్థంబాలాంటి క్షేత్రాలున్నా తెలంగాణకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందన్నారు.
అజ్ఞానం తొలగించి విజ్ఞానం వైపు అడుగుల వేయించడం, మనిషిలో మార్పు, మనిషి చరిత్ర, జీవనం ఎలా కొనసాగించాలి, మనిషి లక్షణాలు, మనుగడ తదితర అంశాలపై ప్రపంచానికి జ్ఞాన బోధన చేసిన మహాత్ముడు గౌతమ బుద్ధుడని అన్నారు. భవిష్యత్లో బౌద్ధమతానికి సంబంధించి ఓ సర్క్యూట్ ఏర్పాటు చేసి ప్రపంచంలోని దలైలామాతో పాటు థాయ్ల్యాండ్ టిబెట్, శ్రీలంక, చైనా తదితర దేశాల నుంచి బౌద్ధ గురువులను రప్పించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
బౌద్ధ మతం కోసం తెలుసుకోవాలంటే నేడు తెలంగాణలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని, ఇది ఈ ప్రాంత విశిష్టత అని అన్నారు. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన సీఎం కేసీఆర్కు ఉందన్నారు.