హైదరాబాద్ : నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు అని అభివర్ణించారు. కాళోజీ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత సీఎం కేసీఆర్కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమని తెలిపారు. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాకవి కాళోజీని గౌరవిస్తూ వారి జన్మదినం (సెప్టెంబర్ – 9)ను ‘తెలంగాణ భాషా దినోత్సవం’ గా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొరమోని వెంకటయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, ప్రొఫెసర్ మనోజ తదితరులు పాల్గొన్నారు.