హన్వాడ, జూలై 21: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించకపోవడంతో ఎలాంటి చెక్ డ్యాములు నిర్మించలేదనారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కర్వెన రిజర్వాయర్ ద్వారా నియోజక వర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపుతూ, దారిలో ఉన్న వాగులన్నింటిపై చెక్ డ్యాంలు నిర్మిస్తామని చెప్పారు.
పాల ఉత్పత్తులపై జీఎస్టీ అన్యాయం..
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం, పెట్రోల్ గ్యాస్ వంటి వాటిపై జీఎస్టీ విధించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నదని ఆరోపించారు.