మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ప్రతినిధులు, అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాసంగి ధాన్యం కొనేందుకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్ కు రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలు, నారాయణపేట జిల్లాలో 109 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చూపవద్దని.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 15 రోజులు అధికారులు, ప్రజా ప్రతినిధులు 24 గంటలూ కష్టపడి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, రైతుల కోసం నీడ, కుర్చీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకం, తేమ కొలిచే యంత్రాలతో పాటు, ఇతర ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు, వ్యవసాయ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లను విధిగా ప్రదర్శించాలన్నారు. ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
గన్నీ బ్యాగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తూకాల్లో అవకతవకలు చేస్తే సహించేది లేదన్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని మొక్కుబడిగా భావించవద్దన్నారు. రైతులు తీసుకువచ్చే ధాన్యంలో తేమ, తాలు, దుమ్ము వంటివి లేకుండా రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు అవగాహన కల్పించాలన్నారు. సివిల్ సప్లై, మార్కెటింగ్, డీఆర్డీఓ, మెప్మా శాఖల ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రైస్ మిల్లర్లు ముందుగానే సరిపడినన్ని గోదాములు గుర్తించి సిద్ధం చేసుకోవాలని, రైతులను ఎక్కువ సేపు వేచి చూసే పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకునాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకు వస్తే బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బయటి నుంచి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా ఉంచాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట కలెక్టర్లు వెంకట్ రావు, దాసరి హరిచందన, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, పౌరసరఫరాల డీఎం జగదీష్, డీఎస్ఓ వనజాత, డీఆర్డీఓ యాదయ్య, మార్కెటింగ్ ఏడీ సారిక, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు, రైతుబంధు మండలాధ్యక్షులు పాల్గొన్నారు.