Minister Srinivas Goud | నారాయణపేట జిల్లాలో తెలంగాణ – కర్ణాటక సరిహద్దుల్లో ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెక్పోస్టును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టులు తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్యంగా వ్యవహరించడాన్ని గమనించిన మంత్రి స్థానిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడారు. చెక్పోస్టులో తగినంత సిబ్బందిని నియమించాలని ఆదేశించాలని సూచించారు. అలాగే, రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెక్పోస్టు ద్వారా తెలంగాణలోకి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.
రాయచూరు నుంచి మహబూబ్నగర్కు వస్తున్న మంత్రి ఆకస్మికంగా కృష్ణా బ్రిడ్జ్ సమీపంలోని చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ తగినంత సిబ్బంది లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన అధికారి ఎక్కడికి పోయారని ఆరా తీశారు. ఎక్సైజ్ విజిలెన్స్ సరిగా లేదని, ఇలా అయితే అక్రమంగా వచ్చే మద్యాన్ని అడ్డుకట్ట వేయడం ఎలా సాధ్యమవుతుందని ఎక్సైజ్ కమిషనర్ను ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అవుతున్న మద్యాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణకు సరఫరా అవుతున్న మద్యంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం సురక్షితం కాదని, దళారులు చెప్పే మాటలు నమ్మి వాటి బారిన పడి ప్రజలు అనారోగ్యానికి గురికావొద్దని సూచించారు. అనంతరం రాయచూరు నుంచి మక్తల్ వైపు వస్తున్న పలు వాహనాలను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపాలని, తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలాంటి పొరపాటు మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వెంట మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ ఉన్నారు.