యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నందనం గ్రామంలో రాష్ట్రంలోనే తొలి నీరా ఉత్పత్తుల కేంద్రానికి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.8కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఐదునెలల్లో అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు జిల్లాల్లో నాలుగు నీరా సేకరణ కేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాలోని గీత కార్మికులు అందరూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నీరా తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానియమని, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మాత్రమే సేకరిస్తారని, ఇందులో ఆల్కహాల్ ఉండదు కాబట్టి మత్తుపానియం కాదన్నారు. అందరూ అన్నివేళల్లో తాగవచ్చని, దీంట్లో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల సహజ సిద్ధమైన ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆరోగ్యానికి అవసరమయ్యే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందన్నారు. నీరా రోగనిరోధకశక్తిని పెంచుతుందని, రక్తపోటును అదుపులో ఉంచుతుందని, మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుందన్నారు.
క్యాన్సర్, కాలేయ సంబంధిత రోగాలను నయం చేస్తుందన్నారు. ఎముకలు బలపడుతాయని, మలబద్ధకాన్ని నివారించి జీర్ణశక్తిని పెంచుతుందని, మైగ్రేన్, తలనొప్పి తగ్గిస్తుందన్నారు. కంటిచూపును, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. నీరాతో పాటు కొన్ని తాటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తామన్నారు. తాటి, ఈత బెల్లం, తాటి, ఈత సిరప్, పామ్ బూస్ట్, పామ్ గ్రాన్యుల్స్, తాటి ఫలాలు, ముంజలు, గేగులు, ఈతపండ్లతో చాలా లాభాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో హరితహారంలో భాగంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ నీరా ఉత్పత్తి కేందానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా జిల్లా గీత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. పాల సేకరణ కేంద్రాల మాదిరిగానే ముందు ముందు నీరా సేకరణ కేంద్రాలు వస్తాయన్నారు. 319 మంది నీరా సేకరణలో శిక్షణ ఇచ్చినట్లు , 12 మాస్టర్స్కి సైతం శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. నీరా సేకరణ కేంద్రాలు నాలుగు మాత్రమే మంజూరు చేశారని , జిల్లాకు పది అయినా ఉండాలని, ఆలేరు నియోజకవర్గానికి ఆరు నీరా సేకరణ కేంద్రాలు మంజూరు చేయాలని ఆమె మంత్రిని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.