మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాదని, దేశ రైతాంగం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తారని తెలిపారు. కేంద్రం వడ్లు కొనకుండా మోసం చేస్తున్నదనే విషయాన్ని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. రైతులను అప్రమత్తం చేశారన్నారు. కానీ తాము వడ్లు కొంటామని బీజేపీ నాయకులు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ వద్ద మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రైతులను తప్పుదారి పట్టించి పంట చేతికి వచ్చాక వడ్లు కొనకుండా మోసం చేశారని మండిపడ్డారు. అయినా కేసీఆర్ రైతులను ఆదుకొనేందుకు వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. బండి సంజయ్ యాత్రలో ప్రజలు ధరల విషయమై ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, తామే కట్టిస్తామని బీజేపీ నాయకులు అనేకమార్లు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. మహబూబ్నగర్లో ఎన్నికలలోపు మత కలహాలు, గొడవలు సృష్టించాలని బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.