వనపర్తి : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులను ఉద్ధరించేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కోస్గి రోడ్డులో దళితబంధు లబ్ధిదారుడు అరవింద్ రూ.10లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బాలాజీ ఎలక్ట్రికల్ వర్క్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.
పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోందన్నారు. ఈ సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దళితబంధు అణచివేతపై అస్త్రం లాంటి పథకమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, పాల్గొన్నారు.