మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్నగర్ పట్టణంలో కనీసం ఒక్క మంచి పార్కు కూడా లేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 30కి పైగా పార్కులను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రూ. 8.71 లక్షలతో నిర్మించిన పెర్క్యులేషన్ ట్యాంక్, రూ. 3.70 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్, రూ. 1.86 లక్షలతో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై సెల్ఫీ పాయింట్, జిల్లాకు చెందిన స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ‘మహా బ్రాండ్’ స్టాల్ ను ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రులు ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ పట్టణంలో కనీసం 500 గజాల్లో కూడా పార్కులు ఉండేవి కావన్నారు. ఇప్పుడు పట్టణంలో పార్కులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. గిన్నిస్ రికార్డు సృష్టించిన సీడ్ బాల్స్ ఇక్కడే వెదజల్లినట్లు గుర్తు చేశారు.
ఇక మహా బ్రాండ్ ద్వారా జిల్లా మహిళలు పలు ఉత్పత్తులు తయారు చేసి ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా విక్రయాలు చేస్తున్నారన్నారు. ప్రతి శిల్పారామంలో కూడా మహా బ్రాండ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఆలోచనల మేరకు మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.