మహబూబ్నగర్ : నాటక రంగానికి పునర్జీవం పోసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో స్వర లహరి ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా ధర్మజ రాజసూయ పద్యనాటక ప్రదర్శన ద్వారక దృశ్యం కార్యక్రమాన్ని మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలపై మోజు కారణంగా నాటకాలకు ఆదరణ కరవుతోందన్నారు. గతంలో నాటకలు చూసిన తర్వాత ఊరంతా బాగుపడేదన్నారు.
సత్య హరిచంద్ర నాటకం చూసి ఊరంతా చర్చించుకునేదని.. సినిమాలు, సీరియల్స్ ప్రభావంతో నాటకాలు అంతరించే ప్రమాదం ఏర్పడిందన్నారు. నాటకానికి పునర్జీవం పోవాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక శాఖ ద్వారా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీనియర్ నాటకరంగ కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ము.డా.చైర్మన్ గంజి వెంకన్న మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, స్వర లహరి కల్చరల్ అకాడమీ బాగన్న గౌడ్, పల్లెర్ల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.